తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ఫోన్ చేసి ఆర్టీసీ సమ్మె గురించి వివరాలు కోరడంతో, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ వెళ్ళి ఆమెకు ఆర్టీసీ సమ్మె, దాని కోసం ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,000 బస్సులు నడుస్తునాయని కనుక ప్రజలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడలేదని చెప్పారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను, కండెక్టర్లను నియమించుకొని ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. వారు ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశామని, టికెట్ ఇచ్చే మెషిన్లను కూడా అందజేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.