గజ్వేలోని సిఎం కేసీఆర్ ఫాంహౌసులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఈరోజు మధ్యాహ్నం తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీస్ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 2003 బ్యాచ్ కు చెందిన వెంకటేశ్వర్లు స్వస్థలం నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలో చాడ గ్రామం. అతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, ఒక మహిళను వేధించడం వంటి కారణాలతో ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయబడ్డాడు. అతని భార్య అభ్యర్ధన మేరకు పోలీస్ శాఖ ఇటీవలే అతనిని మళ్ళీ విధులలోకి తీసుకొని, అక్టోబర్ 1వ తేదీ నుంచి సిఎం కేసీఆర్ ఫాంహౌసులో నియమించింది. అయితే కుటుంబ కలహాల కారణంగా మద్యం మత్తులో అతను తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్లు భావిస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ళు భరించలేకనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకొన్నాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ సిఎం కేసీఆర్ ఫాంహౌసులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలన వార్తే!