అయోధ్య-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టులో నేడు తుది విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నవంబర్ 17న విరమణ చేయనున్నందున, అత్యంత సంక్లిష్టమైన సున్నితమైన ఈ కేసుపై నేటితో విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించి పదవీ విరమణ చేయాలని భావిస్తున్నారు. కనుక ఈరోజు సాయంత్రం 5 గంటలలోపుగా ఇరుపక్షాలు తమతమ వాదనలు పూర్తిచేయాలని జస్టిస్ రంజన్ గగోయ్ విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టులో ఈ కేసు విచరణ తుది దశకు చేరుకోవడంతో అయోధ్య పట్టణంలో కర్ఫ్యూ విధించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఒకవేళ ఇరుపక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించి రాజీకి సిద్దపడితే దశాబ్ధాలుగా సలుపుతున్న ఈ సమస్య త్వరలోనే పరిష్కారంఅవుతుంది. అయితే ఈ వివాదంలో హిందూముస్లింల భావోద్వేగాలు, ఆ వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మతపెద్దల పంతాలు, వివిదపార్టీల రాజకీయ ప్రయోజనాలు ఇంకా అనేక అంశాలు ఇమిడి ఉన్నందున తుది తీర్పు వెలువడే అవకాశం తక్కువేనని భావించవచ్చు. ఒకవేళ ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా తీర్పు వెలువడితే మాత్రం అది చారిత్రాత్మకమైన తీర్పే అవుతుంది.