కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ 17న తెలంగాణ పర్యటన రద్దు అయ్యినట్లు బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. హోంమంత్రిత్వశాఖ పనుల ఒత్తిడి కారణంగా హైదరాబాద్ రాలేకపోతునట్లు డిల్లీ నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆయనకు బదులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా కానీ కేంద్రమంత్రులెవరైనా వస్తారని తెలిపారు. అయితే ముందుగా నిర్ణయించుకునట్లుగానే సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి అధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరూపుతామని తెలిపారు. ఆరోజు ‘ఊరు నిండా జెండాలు’ పేరిట అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో జాతీయజెండాలు ఎగురవేసే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
మజ్లీస్ పార్టీకి భయపడి నిజాం అరాచక పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించడానికి కేసీఆర్ సర్కార్ భయపడుతోందని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపడం లేదని అన్నారు. వాస్తవానికి మజ్లీస్ కనుసన్నలలోనే కెసిఆర్ సర్కార్ పాలన సాగిస్తోందని అన్నారు. మజ్లీస్ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజల గొంతు వినపడకుండా అణచివేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి అన్నారు.