తెలంగాణలో సిఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పధకాలు, అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా విధానాలు, సంస్కరణలు దేశంలో అనేక రాష్ట్రాలకు ఆధర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో కొన్నిటిని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యధాతధంగా అమలుచేస్తోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజనకు సిద్దం అవుతోంది.
ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఆ ప్రాతిపదికనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్విభజించాలని జగన్ ప్రభుత్వం సిద్దమవుతోంది. తెలంగాణలో ముందుగా జిల్లాల పునర్విభజన చేసి ఆ తరువాత మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన చేయడం వలన ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఏపీలో ముందుగా మండలాలు, రెవెన్యూ డివిజన్లను నిర్దారించిన తరువాత జిల్లాల పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న జిల్లాలు:
1. శ్రీకాకుళం 2. విజయనగరం3. విశాఖపట్నం 4. తూర్పుగోదావరి 5. పశ్చిమగోదావరి 6. కృష్ణా7. గుంటూరు 8. ప్రకాశం; 9. నెల్లూరు 10. కడప 11. కర్నూలు 12. అనంతపురం 13. చిత్తూరు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు:
1. అనకాపల్లి (విశాఖ). 2.అరకు (విశాఖ), 3. అమలాపురం (తూ.గో), 4. రాజమండ్రి (తూ.గో), 5 నరసాపురం (ప.గో), 6. విజయవాడ (కృష్ణా), 7. నరసరావుపేట (గుంటూరు), 8. బాపట్ల (గుంటూరు), 9. నంద్యాల (కర్నూలు), 10. హిందూపురం (అనంతపురం), 11. రాజంపేట (కడప), 12. తిరుపతి (చిత్తూరు). వీటిలో ఆరకును గిరిజనజిల్లాగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.