కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. డబ్బై రెండేళ్ళు వయసొచ్చినా ఇంకా చురుకుగా రాజకీయాలలో పాల్గొంటుంటారు. అయితే వయసు పెరిగిన కారణంగా అప్పుడప్పుడు నోరు జారీ ఏదో మాట్లాడేసి తాను చిక్కులో పడటమే కాక కాంగ్రెస్ పార్టీని కూడా చిక్కులో పడేస్తుంటారు. తాజాగా మొహర్రం సందర్భంగా ముస్లిం ప్రజలను ఉద్దేశ్యించి ‘ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర మొహర్రం శుభదినాన మా సలాం’ అని ట్వీట్ చేశారు. మొహర్రంను ఆయన పండుగ అనుకొని శుభాకాంక్షలు తెలిపాలనుకున్నారని అర్ధమవుతూనే ఉంది. కానీ దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న ఆయనకు మొహర్రం సంతాపదినమని తెలియకపోవడమే చాలా విచిత్రమని బిజెపి నేత షాహ్ నవాజ్ హుస్సేన్తో సహా పలువురు ముస్లింలు విమర్శలు గుప్పిస్తున్నారు.