మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయన కస్టడీలో ఉన్నందున ఆ పిటిషన్ విచారణ చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను తక్షణమే విచారణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. నేటితో చిదంబరం సిబిఐ కస్టడీ ముగుస్తుంది కనుక రేపు దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కానీ ఆలోగా సిబిఐ అధికారులు మళ్ళీ ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసును విచారిస్తున్న సిబిఐ కోర్టు దృష్టికి ఈ తాజా పరిణామాలను తీసుకువెళ్లి ఆయనకు బెయిల్ లభించకుండా అడ్డుపడవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. కనుక చిదంబరం పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందో ఊహించడం కష్టమే.