త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఫోటోలతో సహా ఓటర్ల జాబితాలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో 138 మున్సిపాలిటీలు, 3,555 వార్డులను కూడా ఖరారయ్యాయి. ఒకటి రెండు రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నాయి. ఎన్నికలు జరుగబోయే 129 మున్సిపాలిటీలు, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలోని 3,149 వార్డులకు సంబందించిన ఓటర్ల జాబితా, వార్డుల వివరాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ నేడు ప్రకటించబోతోంది. వాటిపై 19సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించి ఆదేరోజున పరిష్కరించి ఈనెల 21న తుది జాబితాను ప్రకటిస్తుంది. ఆదేరోజున పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి మరోవారం రోజులు పడుతుంది కనుక ఈనెల 21 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజులలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది కనుక జూలై 30 న్ లేదా ఆగస్ట్ మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.