బుదవారం ప్రగతి భవన్లో పురపాలక, న్యాయశాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతిరహితమైన, పారదర్శకమైన పాలన సాగినప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. ఇప్పటి వరకు మనం చేసిన పనులు నచ్చబట్టే ప్రతీ ఎన్నికలలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తున్నారు. కనుక వారి ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా మరింత ఉత్తమసేవలను అందించాలని కోరుకొంటున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లే, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవినీతిని అరికట్టి ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు త్వరలో పురపాలక చట్టాన్ని తీసుకురాబోతున్నాము. అవినీతికి పాల్పడేవారిపై కటినచర్యలు తప్పవు. ప్రజల కోసం కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. కొత్త పురపాలక చట్టం రూపొందించిన తరువాత పురపాలక కమీషనర్లకు, అధికారులకు దానిపై అవగాహన కల్పించేందుకు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తాము,” అని అన్నారు.