సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరస్పర అవగాహనతో పనిచేస్తుంటాయి కానీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగతీత ధోరణితో వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు ఫిర్యాదు చేయడం విశేషం. వీలైనంత త్వరగా వార్డుల విభజన, రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించాలని ఎన్నికల సంఘం న్యాయస్థానాన్ని కోరింది. ఇదే అంశంపై ఇంతకు ముందు దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ను కూడా మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 5 నెలలు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధనను మన్నించినా న్యాయస్థానం నేటి నుంచి సరిగ్గా 5 నెలలోగా తప్పనిసరిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ మొదటివారానికి వాయిదా వేసింది.