రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఫిరాయింపుల కారణంగా పార్టీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైన ప్రతీసారి వినిపించే డిమాండే కాంగ్రెస్లో వినిపిస్తోంది. అదే...టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని. అయితే ఆయనను మార్చే ప్రసక్తి లేదని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా స్పష్టం చేశారు.
గాంధీభవన్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “పార్టీని ఎవరు నడిపిస్తున్నా ఎన్నికలలో కొన్ని పొరపాట్లు జరగడం సహజం. వాటిని గుర్తించి సరిదిద్దుకొని ముందుకు సాగుతాము. ఉత్తమ్ నాయకత్వంలోనే మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొంటాము. అందుకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సిద్దం చేస్తాము. మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరించి కీలకపదవులు కట్టబెట్టింది. కానీ ఆయన పార్టీకి నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తుండటం బాధాకరం. కనుక ఆయనపై చర్యలు తప్పవు,” అని చెప్పారు.