మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయిపోయాయి ఒక్క మున్సిపల్ ఎన్నికలు తప్ప. వాటిని కూడా నిర్వహించేస్తే ఇక పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు కనుక వాటిని కూడా జూలై నెలాఖరులోగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాము. వాటి కొరకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది. అది పూర్తికాగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ ఎన్నికలు ఒక్కటీ పూర్తయితే ఇక ప్రజలను కూడా ఇబ్బంది ఉండదు,” అని అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చేసినప్పటి నుంచి ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు, అంటే రాష్ట్రంలో ఒకదాని తరువాత మరొక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దాంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతూనే ఉండేది. ఆ కారణంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. కనుక మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయితే మళ్ళీ నాలుగున్నరేళ్ళ వరకు ఎన్నికలు ఉండవు కనుక అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం తమ పనులు తాము చేసుకోవచ్చు.