తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా నిలువబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులు ద్వారా సుమారు 151 టీఎంసీల గోదావరి జాలలను నిలువచేసి, ఎత్తిపోతల పద్దతిలో ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయనున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డిని ముఖ అతిధిగా ఆహ్వానించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. కనుక త్వరలోనే తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎప్పుడూ కత్తి దూస్తుండే సిఎం కేసీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి పట్ల ఇంత సఖ్యత, గౌరవం ప్రదర్శిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందరికీ తెలిసిన రాజకీయ కారణాల చేతనే సిఎం కేసీఆర్ ఇంత భిన్నమైన వైఖరితో వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలుగుతుందనే వాదనలు వినిపిస్తున్నందున, ఈ కార్యక్రమానికి జగన్మోహన్రెడ్డి హాజరయితే టిడిపి నుంచి విమర్శలు మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇరువురు ముఖ్యమంత్రుల మద్య మంచి సఖ్యత నెలకొని ఉన్నందున, దానిని అలాగే నిలుపుకునేందుకుగాను జగన్మోహన్రెడ్డి కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి.