అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాలో తెరాస అభ్యర్డులను ఒంటి చేత్తో గెలిపించిన తెరాస మాజీ ఎంపీ కవిత లోక్సభ ఎన్నికలలో ఓడిపోయారు. అదీ...రాష్ట్రంలో బొత్తిగా బలంలేదనుకొన్న బిజెపి చేతిలో! ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె సుమారు 68,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆమెకే కాదు...తెరాసకు కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆమె బిజెపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయినప్పటికీ వాస్తవానికి పసుపు, ఎర్రజొన్న రైతుల ఆగ్రహానికి గురై ఓడిపోయారని చెప్పవచ్చు. వారి సమస్యలతో తెరాస సర్కారుకు సంబందం లేదన్నట్లు మాట్లాడటం, వారు రాజకీయ ప్రోద్బలంతోనే ఎన్నికలలో పాల్గొన్నారంటూ చేసిన వ్యాఖ్యాలు తమను అవమానించడంగానే భావించిన రైతన్నలు ఈ ఎన్నికలలో తమ సంఘటిత శక్తిని తెరాసకు రుచి చూపించారని చెప్పవచ్చు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్ రైతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచిది.