రాష్ట్రంలో మూడు విడతలలో పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 27వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు కనుక విజేతలు ఎవరో వెంటనే తేలిపోతుంది. కానీ గెలిచినవారు పదవీ బాధ్యతలు చేపట్టడానికి జూలై 4వరకు వేచిచూడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగుస్తుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక కూడా జూలై 5 తరువాతే జరుగుతాయి. ఇక ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికాలం ఆగస్ట్ 5వ తేదీతో ముగుస్తుంది కనుక ఆ జిల్లాలో అప్పటివరకూ వేచి చూడకతప్పదు.
ఫలితాలు వెల్లడైన తరువాత ఇన్ని రోజులు వ్యవది ఉంటే తప్పకుండా బేరసారాలు, పార్టీ ఫిరాయింపులు ఖాయమని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఫలితాలు వెల్లడైన మరుసటిరోజే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తి చేయాలని రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ను కోరుతామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మే 28 లేదా 29 తేదీలలో ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్లను ఎన్నుకొన్నట్లయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి పదవీకాలం ముగిసిన తరువాతే వారు బాధ్యతలు చేపట్టవచ్చునని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈవిధంగా చేసినట్లయితే బేరసారాలు, ఫిరాయింపులను నిరోదించవచ్చునని అన్నారు.