తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల కోసం మేడిగడ్డ పంప్హౌస్లో 11 మోట్లర్లు, అన్నారం, సుందిళ్ళలో చెరో 8 మోటర్లు బిగిస్తున్నారు. మేడిగడ్డ పంప్హౌస్లో ఇప్పటికే 6, అన్నారంలో 5, సుందిళ్ళలో 6 మోటర్లు బిగించడం పూర్తయింది. మిగిలినవి జూన్ 2వ వారంలోగా బిగించి ట్రయల్ రన్స్ ప్రాంభించాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.
ప్యాకేజీ-6 లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ మోటర్లలో సిద్దంగా ఉన్నవాటి ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. తాజాగా బుదవారం నిర్వహించిన ‘వెట్ రన్’ కూడా విజయవంతం అవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఉత్సాహంగా చకచకా పనులు చేసుకుపోతున్నారు.
వర్షాలు మొదలవగానే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంటుంది కనుక సిద్దంగా ఉన్న అన్ని మోటర్లతో నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. అప్పటికి అన్ని మోటర్ల బిగింపు సిద్దమైతే రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోయవచ్చు లేకుంటే మేడిగడ్డ బ్యారేజి వద్ద వరద నీరు నిలిచిపోయి పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్త చర్యగా మేడిగడ్డ బ్యారేజికు ఎగువన అవసరమైతే నీటిని మళ్లించే విధంగా పిల్లకాలువలు త్రవ్వాలని నిర్ణయించారు.
ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంప్హౌస్లలో కలిపి అదనంగా మరో 15 పంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటికోసం అదనంగా రూ.68 కోట్లు వ్యయం అవుతుంది. అధికారులు అందుకు అంచనాలు తయారుచేసి సిఎం కేసీఆర్కు పంపించారు. దీనితో కలిపి ఈ మూడు పంప్హౌస్ల నిర్మాణానికి రూ.12,392 కోట్లు వ్యయం అవుతుంది. వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ అదనపు పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్న మేఘా ఏజన్సీకే ఈ బాధ్యతను అప్పగించాలని నీటిపారుదలశాఖ అధికారులు నిర్ణయించారు.