గురువారం రాత్రి హైదరాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. వేసవి వడగాడ్పులతో అల్లాడుతున నగరవాసులకు ఈ అకాలవర్షం కాస్త ఉపశమనం కలిగించింది. మరోపక్క జంట నగరాలలో అనేకచోట్ల రోడ్లపైకి నీళ్ళు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిన్న రాత్రి ఈదురుగాలులు కూడా వీయడంతో నగరంలో ఏడు చెట్లు నేలకొరిగినట్లు సమాచారం. ఇటువంటి విపత్కర సమయంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ తక్షణమే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి డ్రైనేజీలను క్లియర్ చేయడంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ అకాలవర్షాలకు సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది.
ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి నెలకొని ఉన్నందున శుక్రవారం, శనివారం రెండు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కనుక వ్యవసాయ మార్కెట్ యార్డులకు మిర్చి, ధాన్యం తదితర ఉత్పత్తులను తీసుకువచ్చిన రైతులు అవి తడవకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.