హైదరాబాద్ నగరంలో పంజగుట్ట జంక్షన్ వద్ద కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో పోలీసులు దానిని అక్కడి నుంచి తొలగించారు. అందుకు నిరసన తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పంజగుట్టలో ఈరోజు ఉదయం ధర్నా చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “మందకృష్ణ మాదిగకు మేము సంఘీభావం తెలుపుతున్నాము. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా నిరసన తెలుపుతున్న మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం తొలగింపు ఘటనను జాతీయస్థాయిలో లేవనెత్తుతాము. కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించి తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేయడం దురదృష్టకరం. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఇంకా ఎంతకాలం వేదిస్తోందో తెలియదు కానీ అటువంటి బెదిరింపులకు మేము భయపడబోము,” అని అన్నారు.