నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టు పట్టుంది. కనుక జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని తెరాస గట్టిగా ప్రయత్నించి సఫలమైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో నల్గొండపై ఆధిపత్యం సాధించేందుకు అధికార తెరాస, తమ ఆధిపత్యం నిలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గట్టిగా ప్రయత్నించడంతో వారి మద్య ఘర్షణ అనివార్యమైంది.
జిల్లాలో తిరుమలగిరి మండలం నాయకునితండాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్-తెరాస శ్రేణుల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎన్నికలు పూర్తయ్యి వారం రోజులైనప్పటికీ అక్కడ పరిస్థితి ఇంకా అలాగే ఉండటం విశేషం. సోమవారం ఉదయం తండాలో మళ్ళీ ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది.
ఈసారి ఇరువర్గాలు రెచ్చిపోయి కర్రలు, బీరు సీసాలతో పరస్పరం దాడులు చేసుకొన్నారు. అంతటితో ఆగకుండా తండాలోని ఇళ్లలోకి జొరబడి విద్వంసం సృష్టించారు. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను కూడా ద్వంసం చేశారు. వారి గొడవలకు భయపడి తండాలో నివసిస్తున్నవారు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దాడులకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకొన్నారు.