న్యూజిలాండ్ కాల్పుల ఘటనలో 40 మంది మృతి

March 15, 2019


img

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌ చర్చ్‌ సిటీలో అల్ నూర్ మసీదు, దానికి సమీపంలోనే గల లిన్ వుడ్ వద్దగల మసీదులలో  ఈరోజు ఉదయం జరిగిన కాల్పులలో మొత్తం 40 మంది చనిపోయారని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్‌ దృవీకరించారు. ఈ రెండు ఘటనలలో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మొదట దీనిని ఎవరో ఉన్మాది చేసిన దాడి అని భావించినప్పటికీ పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో ఇది ఉగ్రవాదుల చర్యేనని తేలిందని జెసిందా ఆర్డెర్న్‌ తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడే ఉన్న బాంగ్లాదేశ్ క్రికెట్ టీం సభ్యులు అందరూ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడగలిగారు.     

ఇవాళ్ళ శుక్రవారం కావడంతో రెండు మసీదులలో ప్రార్ధనలకు వచ్చిన భక్తులతో నిండి ఉంది. వారు ప్రార్ధనలు చేసుకొంటున్న సమయంలో అల్ నూర్ మసీదులోకి ఇద్దరు, లిన్ వుడ్ మసీదులో ఇద్దరు దుండగులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు ఆ మారణఖాండను వీడియో కెమెరాతో షూట్ చేస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో తరువాత ఆ దృశ్యాలను షూటింగ్ చేస్తూ అక్కడే దుండగులు ఉండటంతో వారీలో నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఒక మహిళా కూడా ఉందని సమాచారం. న్యూజిలాండ్ చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన చీకటి రోజని ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్‌ అన్నారు. 


Related Post