ఈనెల 17వ తేదీ నుంచి కొత్తగా ఏర్పాడిన ములుగు, నారాయణపేట జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్-ఛార్జ్ కలెక్టర్లను నియమించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లును ములుగు జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ను నారాయణపేట జిల్లా ఇన్-ఛార్జ్ కలెక్టర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
కొత్త జిల్లాల వివరాలు:
ములుగు జిల్లాలో మొత్తం 9 మండలాలు ఉన్నాయి. అవి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, సమ్మక్క-సారక్క తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు. జిల్లాలో మొత్తం 336 గ్రామాలు ఉన్నాయి. ములుగు జిల్లాకు ఒకపక్క ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, మిగిలిన మూడువైపులా జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్ సరిహద్దు జిల్లాలుగా ఉంటాయి. ములుగు జిల్లాలో 2.94 లక్షలు జనాభా ఉంది.
నారాయణపేట జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. అవి నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు. ఈ జిల్లాలో మొత్తం 252 గ్రామాలున్నాయి. జిల్లాకు ఒకవైపు కర్ణాటక రాష్ట్రం మిగిలినవైపుల మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్ సరిహద్దు జిల్లాలుగా ఉంటాయి. జిల్లాలో 5.04 లక్షలు జనాభా ఉంది. ప్రజల కోరిక మేరకు కోయిలకొండ మండలాన్ని మహబూబ్నగర్లోనే ఉంచేసింది.