దేశంలో మొట్టమొదటి టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఉన్నారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ. కానీ కొత్తగా వచ్చిన ప్రైవేట్ టెలికాం సంస్థల కంటే చాలా వెనుకబడిపోయింది. రిలయన్స్ జియో 4జితోనే సేవలు ప్రారంభిస్తే బీఎస్ఎన్ఎల్ నేటికీ 4జి సేవలు అందించలేని దుస్థితిలో ఉంది. నేటికీ అనేక రాష్ట్రాలలో 2జి, 3జి సేవలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్ సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్ళను తట్టుకొని నిలబడేందుకు బీఎస్ఎన్ఎల్ కూడా మెల్లగా 4జి సేవలు అందించడానికి సన్నాహాలు చేసుకొంటోంది.
రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం బీఎస్ఎన్ఎల్ 4జి సేవలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆసిఫాబాద్లో 4జి సేవలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి కనుక 2జి, 3జి సేవలు వినియోగించుకొంటున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కొత్త సిఎం కేసీఆర్ కార్డులను తీసుకొని 4జి సేవలను వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాను. త్వరలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో, ఆ తరువాత జిల్లా అంతటా 4జి సేవలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నెల 20న మంచిర్యాల జిల్లా కేంద్రంలో, 25న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 4జి సేవలు ప్రారంభించబోతున్నాము. అనంతరం ఉట్నూర్, బాసరలో 4జి సేవలు ప్రారంభిస్తాము,” అని తెలిపారు.