వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుండటం సాధారణ విషయమే కానీ జిల్లా కలెక్టరు సస్పెండ్ చేయబడటం ఆశ్చర్యకరమే. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు వికారాబాద్ జిల్లా కలెక్టరు సయ్యద్ ఒమర్ జలీల్ ను సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని శనివారం లేఖ వ్రాసింది.
అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి ఆనంద్ 3,092 ఓట్లు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి జి ప్రసాద్ కుమార్ పై విజయం సాధించారు. కౌంటింగులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వారిలో ప్రసాద్ కుమార్ కూడా ఒకరు. అయితే ఆ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబందనలకు విరుద్దంగా వికారాబాద్ జిల్లా కలెక్టరు సయ్యద్ ఒమర్ జలీల్ 125ఈవీఎం, వివిప్యాట్ లకు వేసిన సీళ్ళు తొలగించారని ప్రసాద్ కుమార్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టరును తక్షణం సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.