మరో రెండు నెలలోగా లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక అన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీల హడావుడి మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రుల రాష్ట్ర పర్యటనలు కూడా మొదలయ్యాయి. ప్రధాని మోడీ ఆదివారం గుంటూరులో పర్యటించి ఏపీ సిఎం చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగి వెళ్ళారు. ఇవాళ్ళ కేంద్ర జౌళి శాఖామంత్రి స్మృతీ ఇరానీ మహబూబ్నగర్ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అప్పన్నపల్లిలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో శక్తి కేంద్ర ఇన్-ఛార్జ్, బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశమయ్యి లోక్సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చించనున్నారు. బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలొ ఘోరపరాజయం పొందిన నేపద్యంలొ బిజెపికి లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలోని 17 సీట్లలో 16 సీట్లు తామే గెలుచుకొంటామని తెరాస నేతలు పూర్తి ఆత్మవిశ్వాసంతో చెపుతున్నందున, లోక్సభ ఎన్నికలు కూడా రాష్ట్ర బిజెపికి మరో అగ్నిపరీక్షగా మారనున్నాయి. మరి ఈ పరీక్షలోనైనా పాసవుతుందో లేదో చూడాలి.