మూడు విడతలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో నేటి నుంచి మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. నేటి నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆదివారం అర్హులైన అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. మరుసటి రోజున నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. జనవరి 28వరకు అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. జనవరి 30వ తేదీన పోలింగ్, వెనువెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలున్నాయి. మొదటివిడతలో 4480 పంచాయతీలు వాటిలో గల 39,832 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవ విడతలో 4137 పంచాయతీలు వాటిలో గల 36,620 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మూడవ విడతలో మిగిలిన 4134 పంచాయతీలకు వాటిలో వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30వ తేదీనాటికి మూడు దశల ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడుతాయి.