సాధారణంగా మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగిసి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక ఆలోపుగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ సమర్పిస్తుంటాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినందున, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా రోజువారీ ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక అవి ముగిసిన తరువాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. ఆలోపుగా గ్రామపంచాయతీలు కూడా ఏర్పడి, గ్రామాలలో జరుగవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించి ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతాయి కనుక బడ్జెట్లో పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించవచ్చునని సిఎం కేసీఆర్ తెలిపారు.