తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస విజయానికి తీవ్రంగా కృషి చేసిన కేటిఆర్కు ప్రమోషన్ లభించింది. ఆయనను తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. త్వరలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు సిద్దం అవుతున్నందున, రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చూసుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఇంకా మంత్రి పదవులను కూడా భర్తీ చేయవలసి ఉంది కనుక ఆయనకు ఇదివరకు నిర్వహించిన పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. మంత్రి హరీష్ రావుకు కూడా మళ్ళీ సాగునీటిశాఖతో పాటు మరికొన్ని కీలక శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఏర్పాటు చేయబడుతున్న వివిద పరిశ్రమలకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా సజావుగా సాగుతాయి.