కోదండరామ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన తెలంగాణ జనసమితి పోటీ చేసిన 8 స్థానాలలో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ నేతలలో అయోమయస్థితి నెలకొంది. ముందుగా అనుకొన్నట్లు ఒంటరిగా పోటీ చేయకుండా ప్రజాకూటమిలో చేరడం వలననే ఓడిపోయామా లేక చంద్రబాబునాయుడు రాకతో కాంగ్రెస్ పార్టీతో పాటు తామూ మునిగామా లేక తాము భావిస్తున్నట్లు తమకు ప్రజలలో ఆదరణ లేకనే ఓడామా?అని తమ ఓటమికి కారణాలు వెతుకొంటూనే, ఇకపై ఏవిధంగా ముందుకు సాగాలి? అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మరో ఐదేళ్లు పార్టీని నడిపించడం కష్టమే కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తే మంచిదా లేక త్వరలో జరుగనున్న పంచాయితీ ఎన్నికలలో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకొన్నాక అప్పుడు నిర్ణయం తీసుకొంటే మంచిదా? అని టీజెఎస్కు నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పంచాయితీ ఎన్నికలకు వెళ్లదలిస్తే మళ్ళీ ప్రజాకూటమితో కలిసి వెళ్ళాలా లేక ఈసారి ఒంటరిగా వెళ్ళి తమకున్న బలం, ప్రజాధారణ పరీక్షించుకోవాలా? అనే చర్చలు కూడా టీజెఎస్లో సాగుతున్నాయి. ఓటమి షాక్ నుంచి అందరూ తేరుకొన్నాక త్వరలోనే ప్రజాకూటమి సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించవచ్చు.