గత 15 ఏళ్ళుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరం కాగా బిజెపికి 109 మాత్రమే వచ్చాయి. కనుక ఆయన ఈరోజు ఉదయం రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ ఆనందీ బెన్ కు తన రాజీనామా లేఖను అందజేశారు.
114 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీకి బిఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కనుక సుదీర్గకాలం తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.
షరా మామూలుగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రి పదవికి పలువురు పోటీ పడుతున్నారు. కానీ వారిలో సీనియర్ నేతలు కమల్ నాధ్, జోతిరాధిత్య సింధియాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రంలోగా కాంగ్రెస్ అధిష్టానం వారిలో ఒకరిపేరు ఖరారు చేసినట్లయితే రేపు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగవచ్చు.