బాబుకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: కేసీఆర్‌

December 12, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించిన తరువాత సిఎం కేసీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ వచ్చి పనిచేసి వెళ్లారు కనుక ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏవిధంగా ఉండబోతోందో త్వరలోనే అందరూ చూస్తారు. తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని ఆయన చెపుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చి వారి మద్య విభేధాలు సృష్టించే ప్రయత్నం చేశారు. తెరాస గెలవబోతోందని తెలియగానే మాకు అభినందనలు తెలుపుతూ ఆంద్రా నుంచి సుమారు లక్ష ఫోన్లు వచ్చాయి. ఇక మెసేజులకు లెక్కే లేదు. మమ్మల్నిఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరుతున్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని నేను మాత్రం కోరుకోకూడదా? దేశరాజకీయాలను సరిదిద్దే ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రా రాజకీయాలపై కూడా దృష్టి సారించి అక్కడి రాజకీయాలను కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తాను,” అని అన్నారు. 

చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇవడం అంటే ముందుగా ఓటుకు నోటు కేసును అటక మీద నుంచి దించి దానిని వేగవంతం చేయడం కావచ్చు. ఆ తరువాత... ఏపీలో చంద్రబాబును ఓడించి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అందుకు అవసరమైన మార్గదర్శనం చేసి, ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయన గెలిచేందుకు అన్ని విధాలా సహకరించడం కావచ్చు. తద్వారా చంద్రబాబును శాస్వితంగా రాజకీయాల నుంచి తప్పుకొనేలా చేయాలని కేసీఆర్‌ ఆలోచన కావచ్చు.

అయితే కెసిఆర్ తనను, తన పార్టీని రాజకీయంగా దెబ్బతెస్తానని బహిరంగంగా హెచ్చరించిన తరువాత చంద్రబాబునాయుడు చేతులు ముడుచుకొని కూర్చోరు కనుక రానున్న రోజులలో వారిద్దరి మద్య మళ్ళీ రాజకీయయుద్ధాలు ప్రారంభం కావచ్చు. 


Related Post