రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తనకు టికెట్ లభించకపోవడంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ లు ఇద్దరూ పార్టీ టికెట్లు అమ్ముకొన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని భక్త చరణ్ దాస్ కుమారుడు సాగర్ తనను ఆడిగాడని చెపుతూ, తమ మద్య సాగిన ఆ ఫోన్ సంభాషణ ఆడియో రికార్డింగును కూడా మీడియాకు విడుదల చేసారు. క్యామ మల్లేశ్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలలో నిజానిజాలను విచారించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు సిద్దమైంది. అందుకుగాను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యామ మల్లేశ్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసి మంగళవారం రాత్రిలోగా సంతృప్తికరమైన సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. తనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై తీవ్రంగా స్పందించిన క్యామ మల్లేశ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.
1. కోమటిరెడ్డి సోదరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ అధిష్టానం నిర్ణయాలను ప్రశ్నించినప్పుడు, మీపై పార్టీఅధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు మీరు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
2. కార్తీక్ రెడ్డి (సబితా ఇంద్రారెడ్డి కుమారుడు) తనకు కాంగ్రెస్ టికెట్ లభించనందుకు నిరసనగా రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, కాంగ్రెస్ దిమ్మను పగులగొట్టారు. కానీ ఆయనపై మీరు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు?
3. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పార్టీ కోసం నా స్వంత డబ్బు, ఆరోగ్యం పణంగా పెట్టి పనిచేసిన నాపై ఎందుకు చర్యలు తీసుకొంటున్నారు? అని ప్రశ్నలు సందించారు.
అయితే షోకాజ్ నోటీసుకు ఈ ప్రశ్నలు సమాధానం కావు కనుక క్యామ మల్లేశ్ పై బహిష్కరణ వేటు పడటం ఖాయమేనని భావించవచ్చు. ఇంతకీ క్యామా మల్లేశ్ ఆరోపించినట్లు కాంగ్రెస్ పెద్దలు పార్టీ టికెట్లు అమ్ముకొన్నారా లేదా? అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.