తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ జనగామ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయం అయ్యింది. నిన్న రాత్రి డిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యి మాట్లాడి హైదరాబాద్ తిరిగి వచ్చేసిన తరువాత జనగామలో కోదండరామ్ కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార రధాలు బయటకు వచ్చాయి. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం. టిజేఎస్ నేతలు ఇప్పటికే జనగామలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. డిసెంబరు 5వరకు కోదండరామ్ అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. జనగామ నుంచి కోదండరామ్ పోటీ చేయడం ఖాయం అయ్యింది కనుక ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఏమి చేస్తారో చూడాలి. ఆయన రాహుల్ గాంధీ మాట మన్నించి కోదండరామ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారా లేక స్వతంత్ర అభ్యర్ధిగా లేదా బిజెపి లేదా బి.ఎస్.పిలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారా? అనేది నేడో రేపో తెలుస్తుంది.