తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెరాస అన్నివిధాలా సిద్దంగా ఉన్నప్పటికీ, నేటికీ మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రంలో తెరాస ఎన్నికల ప్రచారం ఏకపక్షంగా సాగుతోంది. అయితే ఈనెల 19వ తేదీతో నామినేషన్లకు గడువు ముగుస్తుంది కనుక అప్పటికి మహాకూటమిలో నాలుగు పార్టీలు కూడా ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతాయి. కనుక సిఎం కేసీఆర్ ఆరోజు నుంచే వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజున మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో బహిరంగసభ నిర్వహిస్తారు. తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు జనగామ జిల్లాలో పాలకుర్తిలో బహిరంగసభ నిర్వహిస్తారు.
మరుసటిరోజు అంటే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్ధిపేటజిల్లాలో సిద్ధిపేట, దుబ్బాకలో, 2.30 గంటలకు హుజూరాబాద్, 3.30 గంటలకు సిరిసిల్ల, వేములవాడ, సాయంత్రం 4.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో సిఎం కేసీఆర్ వరుసగా బహిరంగసభలు నిర్వహిస్తారు.
సిఎం కేసీఆర్, ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు అందరూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు కనుక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కనుంది.