మంత్రి కేటిఆర్ గురువారం మధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్ క్లబ్బులో మీడియాతో మాట్లాడుతూ, “మాకు ప్రధాని నరేంద్ర మోడీనో లేక చంద్రబాబు నాయుడునో మరొకరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. కనుక బిజెపి పట్ల మేము మెతక వైఖరి అవలంభిస్తున్నామనే వాదన అర్ధరహితం. నిజం చెప్పాలంటే ఈసారి ఎన్నికలలో బిజెపికి ఒక్క సీటు గెలవనీయకుండా చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు కానీ డిపాజిట్లు దక్కితే చాలనుకొనే పరిస్థితి వారికి ఎదురవబోతోంది. ప్రస్తుతం మా పార్టీ దృష్టి అంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఇవి ముగిసిన తరువాత మా పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారు. దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఒక రాజకీయశక్తి అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ గారు దాని కోసం గట్టిగా కృషి చేస్తారు,” అని చెప్పారు.
అంటే సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను విరమించుకోలేదని అర్దమవుతోంది. కానీ ఒకపక్క ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలను అన్నిటినీ ఏకం చేసి మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుంటే, సిఎం కేసీఆర్ తన ఆలోచనకు ఏవిధంగా కార్యరూపం ఇవ్వాలనుకొంటున్నారో చూడాలి.