రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు పార్టీలకు రాజ్యాధికారం అప్పజెపితే, అవి తమ స్వంత ఆలోచనలను, అభిప్రాయాలను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకు ఉదాహరణగా బిజెపి పాలిత యూపీని చెప్పుకోవచ్చు.
యూపీ శాసనసభ ఎన్నికల సమయంలో బిజెపిని గెలిపిస్తే రాష్ట్రాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పిన బిజెపి, అధికారంలోకి వచ్చేక హిందుత్వ అజెండాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో పరిష్కరించవలసిన అనేక సమస్యలు ఉండగా యూపీ సిఎం యోగి ఆదిత్యనాధ్, అలహాబాద్ నగరం పేరును ‘ప్రయాగ్ రాజ్’గా మార్చుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఆ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.