గత ఏడాది నవంబర్ 28 నుంచి నేటి వరకు హైదారాబాద్ మెట్రో సర్వీసులు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగిపోతున్నాయి. మొట్టమొదటిసారిగా శనివారం ఉదయం మియాపూర్-అమీర్ పేట కారిడార్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బాలానగర్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైల్ నిలిచిపోయింది. ఉదయం అందరూ ఉద్యోగాలకు వెళ్ళే సమయంలో ఈ సమస్య ఏర్పడటంతో ఆ మార్గంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్రో అధికారులు యుద్దప్రాతిపదికన మరమత్తులు చేస్తున్నారు. మరికొద్ది సేపటిలో మెట్రో సేవలు పునః ప్రారంభం కావచ్చునని చెపుతున్నారు. మరమత్తులు జరుగుతున్నందున మియాపూర్ నుంచి బాలానగర్ వరకు మెట్రో సేవలు నిలిపివేయబడ్డాయి. అయితే ఎర్రగడ్డ నుంచి అమీర్ పేట, ఎల్బీ నగర్-అమీర్ పేట మద్య యధావిధిగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.