వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న కొండా సురేఖ తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ స్థానానికి తెరాసలో పోటీ మొదలైంది. ఈసారి నగర్ మేయర్ నరేందర్కు టికెట్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తుండటంతో అక్కడి నుంచి పోటీ చేయాలనుకొంటున్న తెరాస నేత గుడిమళ్ల రవికుమార్ బుదవారం నగరంలో రత్న హోటల్లో తన అనుచరులతో సమావేశమయ్యి మేయర్ నరేందర్పై నిప్పులు చెరిగారు.
“ఆయనకు మేయర్ గా తెరాస మంచి అవకాశం కల్పించినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మేయర్ అసమర్దత కారణంగానే నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో రోడ్లన్నీ గోతులమయంగా మిగిలిపోయాయి. మొదటి నుంచి తెరాస కార్యకర్తలుగా పనిచేస్తున్న మావంటివారు మా ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ గట్టిగా నాలుగు రూపాయల పని చేసుకోలేకపోయాము. కానీ ఇతర పార్టీల నుంచి తెరాసలో జొరబడిన తెలంగాణ ద్రోహులు రూ.40 నుంచి 400 కోట్లు వరకు సంపాదించుకొని దర్జాగా తిరుగుతున్నారు. తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న మావంటివారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన తెలంగాణ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇవ్వడం న్యాయమా?అటువంటివారి వలన పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు మానసికంగా చాలా క్షోభననుభవిస్తున్నారు. ఆనాడు నన్ను ఎంపీ పదవికి అర్హుడనని చెప్పిన సిఎం కెసిఆర్, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ పొందడానికి అర్హుడిని కానని భావిస్తున్నారా? ఒకవేళ ఆయనకే టికెట్ కేటాయించినట్లయితే నేను స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగి పోటీ చేయడం ఖాయం,” అని హెచ్చరించారు.