టిఆర్ఎస్‌కు శంకరమ్మ హెచ్చరిక!

September 22, 2018


img

అవును.. తెలంగాణా అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టిఆర్ఎస్‌ అధిష్టానాన్ని  హెచ్చరించింది. ఆమె శుక్రవారం ఎల్.బి.నగర్ లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నాకు మళ్ళీ హుజూర్ నగర్ నుంచి టికెట్ ఇవ్వడానికి సిఎం కెసిఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు అనుకూలంగానే ఉన్నారు. కానీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుపడుతున్నారు. తన అనుచరుడు శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నా కొడుకు శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేసి తెలంగాణా ఉద్యమాలకు ప్రాణం పోశాడు. అతని తల్లినైన నాకు పార్టీలో అన్యాయం జరుగుతోంది. గత ఎన్నికలలో నేను ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మద్యే ఉన్నాను. బీసి మహిళనైన నేను పోటీ చేయడం మంత్రి జగదీష్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే నాపై సిఎం కెసిఆర్‌కు లేనిపోని అబద్దాలు చెప్పి నాకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకొని మంత్రి జగదీష్ రెడ్డి దానికి బాధ్యుడని సూసైడ్ లెటర్ లో వ్రాసిపెడతాను,” అని హెచ్చరించారు. 

శ్రీకాంతాచారి తెలంగాణా కోసం బలిదానం చేస్తే, అతని తల్లి శంకరమ్మ టికెట్ కోసం ఆత్మహత్య చేసుకొంటానని, సూసైడ్ లెటర్ లో మంత్రి పేరు వ్రాస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్రం కోసం కొడుకు చేసిన అపూర్వ త్యాగాన్ని ఆమె ఈవిధంగా వాడుకోవాలనుకోవడం దురదృష్టకరం. అతని త్యాగాన్ని గుర్తించే గత ఎన్నికలలో ఆమెకు కెసిఆర్‌ టికెట్ ఇచ్చారు కానీ అప్పుడే ఆమె గెలవలేకపోయారు. ఇక ఇప్పుడు ఏమి గెలవగలరు? అందుకే ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అది గ్రహించకుండా ఈవిధంగా మాట్లాడుతూ మరింత చులకన అవుతున్నారు.


Related Post