టిఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా, టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సమక్షంలో రమేష్ రాథోడ్, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికలలో ఖానాపూర్ నుంచి టికెట్ లభిస్తుందనే హామీతో ఆయన టిఆర్ఎస్లో చేరారు కానీ ఈసారి కూడా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో టిఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఖానాపూర్ టికెట్ ఆఫర్ చేసినందునే ఆ పార్టీలో చేరారు కనుక ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలోని మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం ఉండదు. కనుక ఖానాపూర్ లో ఈసారి కాంగ్రెస్ మహాకూటమి తరపున రమేష్ రాథోడ్, టిఆర్ఎస్ అభ్యర్ధి రేఖా నాయక్ మద్య గట్టి పోటీ ఉండబోతోంది.