తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 23 నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఆయన ఈనెల 7న హుస్నాబాద్ లో ‘ప్రజా ఆశీర్వాద సభ’ పేరుతో మొట్టమొదటి ఎన్నికల ప్రచారసభను నిర్వహించారు. కానీ ఆ తరువాత టిఆర్ఎస్లో టికెట్లు ఆశించి భంగపడినవారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుండటంతో వారినందరినీ బుజ్జగించి దారికి తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తునందున మళ్ళీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించలేదు. సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, ఇంకా పార్టీలో కొందరు ముఖ్య నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి టిఆర్ఎస్లో అసమ్మతి సెగలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నందున సిఎం కెసిఆర్ ఈ నెల 23 నుంచి వరుసగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే ఆ సభల షెడ్యూల్ ప్రకటించవచ్చు. ఈసారి నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.