ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆయన మొన్న శనివారం హన్మకొండకు వెళ్ళినపుడు అక్కడి సర్క్యూట్ హౌజ్లో బస చేశారు. ఆ సంగతి తెలుసుకొన్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ కార్యకర్తలు నుంచి భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. వారు ‘రాసలీలల రాజయ్య మాకొద్దు స్టేషన్ఘన్పూర్ నుంచి మీరే పోటీ చేయాలని’ కోరుతూ చాలా సేపు నినాదాలు చేశారు.
గత నాలుగేళ్ళలో రాజయ్య తన నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయకపోగా జరుగుతున్న అభివృద్ధి పనులలో కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను, అధికారులను వేధించేవాడని వారు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు, అవినీతికి అలవాటు పడిన రాజయ్య చివరికి పార్టీ కార్యకర్తలను సైతం వేధించేవాడని వారు ఫిర్యాదు చేశారు. ఇవి చాలవన్నట్లు గౌరవ ప్రజాప్రతినిధిగా ఉన్న రాజయ్య స్త్రీలోలుడని కనుక ఆయన మాకు అక్కరలేదని వారు కడియం శ్రీహరికి స్పష్టం చేశారు. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేయాలని అప్పుడే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు కోరారు. ఒకవేళ కడియం పోటీ చేయలేని పక్షంలో వేరెవరిని నిలబెట్టినా తమకు అభ్యంతరంల్ లేదని కానీ రాజయ్య పోటీ చేస్తే మాత్రం తాము ఆయనకు సహకరించబోమని స్పష్టం చేశారు.
ఊహించని ఈ పరిణామంతో కడియం శ్రీహరి మొదట కాస్త ఇబ్బందిపడినా వెంటనే తేరుకొని, ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళతానని, ఆయన ఏ నిర్ణయం తీసుకొంటే దానిని అందరం పాటిద్దామని చెప్పి వారిని శాంతపరిచి వెనక్కు తిప్పి పంపారు. రాజయ్య అభ్యర్ధిత్వం పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు కూడా స్టేషన్ఘన్పూర్ నుంచి ఆయననే పోటీ చేయిస్తారా లేక కడియం శ్రీహరి లేదా వేరెవరినైనా బరిలో దింపుతారో చూడాలి.