చంద్రబాబుకి టిఆర్ఎస్‌ నేతలు వార్నింగ్

September 15, 2018


img

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడిని టిఆర్ఎస్‌ ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా హెచ్చరించారు. టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రజలు ఆయనకు ఏపీలో పరిపాలించమని అధికారం కట్టబెడితే ఆయన తెలంగాణా వ్యవహారాలలో వేలు పెడుతున్నారు. ఏపీ ప్రజలు కట్టిన పన్నులలో వందల కోట్ల రూపాయలు ఇక్కడ టిడిపి కార్యాలయానికి తెచ్చి ఇక్కడ మా ప్రభుత్వానికి, మా పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నడానికి ఖర్చుచేస్తున్నారు. మా రాష్ట్రంలోఏపీ ఇంటలిజన్స్ అధికారులకు ఏమి పని? ఏబీ వేంకటేశ్వర రావు అధ్వర్యంలో ఇక్కడ ఏపీ ఇంటలిజన్స్ అధికారులు పనిచేస్తున్నారు. వారి జ్యూరిస్ డిక్షన్ కానీ హైదరాబాద్‌ నగరంలో ఏబీ వేంకటేశ్వరరావు బృందం పనిచేస్తుండటాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము.

ఏబీ వేంకటేశ్వర రావు ఆయన బృందాన్ని తక్షణమే ఏపీకి తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడుకు సూచిస్తున్నాము. తెలంగాణాలో జరగరానిది ఏదైనా జరిగితే అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. ఒకవేళ వారంతట వారు వెళ్ళకపోతే వారిని తక్షణం పోలీసుల సహాయంతో ఏపీకి త్రిప్పి పంపించేయాలని టిఆర్ఎస్‌ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణా డీజి మహేందర్ రెడ్డిగారిని కోరుతున్నాము. లేకుంటే టిఆర్ఎస్‌ తరపున మేమే వాళ్ళను పంపిస్తాము. తెలంగాణా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటూ కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడుతో తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు కలిసిపని చేస్తుండటం సిగ్గు చేటు. కాంగ్రెస్‌ టిడిపి నేతలు కలిసి తెలంగాణా అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పి కొడతాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసుకొంటే ఆయనకే మంచిది. కాదని తెలంగాణాలో కుట్రలు చేస్తామంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది,” అని బాల్క సుమన్ హెచ్చరించారు. 


Related Post