కాంగ్రెస్‌ కూడా వచ్చే నెలలోనే ...

August 18, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌ పర్యటన ముగించుకొని వెళ్ళిపోయిన తరువాత టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులలో మంచి ఉత్సాహం నింపింది. రాహుల్ పర్యటనతో టిఆర్ఎస్‌లో కూడా చలనం వచ్చినట్లే ఉంది. బహుశః అందుకే సిఎం కెసిఆర్‌ సెప్టెంబర్ నెలలోనే పార్టీ అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు మాపార్టీ సిద్ధంగా ఉంది. మా పార్టీ అభ్యర్ధుల జాబితాను తయారుచేయమని రాహుల్ గాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను ఆదేశించారు. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి అభ్యర్ధులను నిర్ణయిస్తాము. రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రకటించడానికి అవసరమైన కసరత్తు మొదలుపెట్టాము.” అని చెప్పారు. 

టిఆర్ఎస్‌ తన అభ్యర్ధులను ప్రకటిస్తే కాంగ్రెస్‌ పార్టీపై కూడా ఒత్తిడి పడుతుందని ఊహించినట్లుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన ఉంది. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలుపెడుతునట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారు కనుక ఇక ఆ పార్టీలో నేతల హడావుడి కూడా పెరుగుతుంది. అలాగే టికెట్లు లభించని నేతల అలకలు, బుజ్జగింపులు, ఫిరాయింపుల కార్యక్రమం కూడా మొదలవుతుంది.


Related Post