ఈరోజు సాయంత్రం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తికాగానే ప్రధాని మోడీ కేరళకు బయలుదేరారు. ఈరోజు రాత్రి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ప్రధాని మోడీ సమావేశమయ్యి కేరళ పరిస్థితుల గురించి తెలుసుకొంటారు. రేపు ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో విమానంలో పర్యటించి వరద పరిస్థితులను జరిగిన నష్టాన్ని స్వయంగా చూస్తారు. ఇప్పటికే కేంద్ర సహాయ, వైద్య బృందాలు, నేవీ సిబ్బంది కేరళలో సహాయచర్యలలో పాల్గొంటున్నారు. రేపు ప్రధాని పర్యటన తరువాత అవసరాన్ని బట్టి కేరళ రాష్ట్రానికి కేంద్రం మరింత సహాయం అందించవచ్చు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 324 మంది చనిపోగా, సుమారు రెండున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు.