గత వారంపదిరోజులుగా భారీ వర్షాలు, వారాధలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.25 కోట్లు సాయం ప్రకటించారు. దానితోపాటు రెండున్నర కోట్లు విలువగల నీటిని శుద్ధి చేసే ఆర్వో మెషిన్లను కూడా తక్షణమే కేరళ రాష్ట్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. కేరళ రాష్ట్రం కోరినట్లయితే అవసరమైన సహాయం అందించడానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉందని కేరళ ప్రభుత్వానికి సమాచారం అందించారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఆపదలో చిక్కుకొన్న కేరళ రాష్ట్రానికి యధాశక్తిన సహాయం చేయాలని కోరారు.
ఈ వర్షాలు, వరదల కారణంగా కేరళలో అనేక జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది ఇళ్ళు కూలిపోయాయి. ఇంతవరకు 324 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజునే 24మంది చనిపోయారు. కోట్లాది రూపాయల విలువగల ఆస్తి నష్టం జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది. అలప్పుజ జిల్లాలో వరదలో చిక్కుకొన్న ఒక ఇంట్లో ఉన్న గర్భవతికి ఈరోజు మధ్యాహ్నం హటాత్తుగా పురిటి నొప్పులు మొదలవడంతో విషయం తెలుసుకొన్న నేవీ సిబ్బంది ఆమెను హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.