కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్ధు కేసు విచారణలో ప్రతీసారి అనూహ్యపరిణామాలు జరుగుతుండటం విశేషం. ఈ కేసులో నుంచి పుట్టుకొచ్చిన కొత్తకేసు కోర్టుధిక్కార కేసు. దానిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రభుత్వ స్పందనపట్ల హైకోర్టు న్యాయమూర్తి మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వ వైఖరిలో గుణాత్మకమైన మార్పు ఏదీ కనబడకపోవడంతో ఇవాళ్ళ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారిని, డిజిపి మహేందర్ రెడ్డిని, నల్గొండ, గద్వాల్ ఎస్.పిలను ప్రతివాదులుగా చేసి వారికి నోటీసులు పంపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరి శాసనసభ్యత్వాలను పునరుద్దరించి వారికి భద్రత కల్పించాలని తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు వారిపై చట్టప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఆగస్ట్ 28లోగా వివరణ ఇవ్వాలని నోటీసులలో కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేసింది.