టిఆర్ఎస్లో తరచూ వివాదాలలో చిక్కుకొనేవారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా ఒకరు. జనగాం మండలంలో పెంబర్తిలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ విషయంలో ఆయన స్థానిక మహిళా విఆర్ఓను బూతులు తిట్టారు. రాత్రిపూట ఆమె ఇంటికి వెళ్ళి అందరి ముందు తిట్టడంతో ఆమె చాలా బాధపడి రెవెన్యూ ఉద్యోగసంఘాల నేతలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై పిర్యాదు చేశారు. ఈ సంగతి తెలుసుకొని టిఆర్ఎస్ నేతలు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె జిల్లా కలెక్టరుకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఆయన జనగావ్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, జాయింట్ కలెక్టర్, మహిళా రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడటంతో కలెక్టర్ దేవసేన ఆయనపై నేరుగా సిఎం కెసిఆర్ కే పిర్యాదు చేశారు. జనగావ్ లో ప్రభుత్వానికి చెందిన బతుకమ్మకుంట చెరువు స్థలంలో 2,000 చదరపు గజాల స్థలాన్ని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆక్రమించుకొన్నారని, ఆయనను అడ్డుకొన్నందుకు తమపట్ల అసభ్యంగా మాట్లాడారని ఆమె పిర్యాదు చేశారు. ఆమె ఐఏఎస్ అధికారుల సంఘానికి కూడా పిర్యాదు చేశారు. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలలో దేవసేనకు వేరే జిల్లాకు బదిలీచేయబడ్డారు. దాంతో ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. మళ్ళీ నిన్న ఆయనపై మహిళా వీఆర్వో పిర్యాదు చేశారు కనుక ఈసారైనాఆయనపై సిఎం కెసిఆర్ చర్యలు తీసుకోంటారో లేక ఫిర్యాదు చేసినందుకు ఆమెనే శిక్షిస్తారో చూడాలి.