బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్ గుడ్-బై!

August 13, 2018


img

ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణం కాస్త విచిత్రంగా ఉంది. తాను గోసంరక్షణ కారణంగానే ఎమ్మెల్యే కాగలిగానని, ఇప్పుడు అదే పనికోసం తాను పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీ, హైదరాబాద్‌లో పలుప్రాంతాలలో సుమారు 3000కు పైగా ఆవులను వధించేందుకు తరలించారని రాజాసింగ్ చెప్పారు. హిందువులు ఆరాధించే ఆవులను అక్రమంగా తరలించి వధిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు.                 

 రాష్ట్రం ఏర్పడక మునుపు 78 చెక్-పోస్టులు ఉండేవని కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటి సంఖ్యను తగ్గించేయడంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రోజూ బారీ సంఖ్యలో ఆవులు, ఎద్దులను కబేళాలకు తరలించి వధిస్తున్నారని రాజాసింగ్ ఆవేధన వ్యక్తం చేశారు. ఆవుల అక్రమ తరలింపును అడ్డుకోవడమే తన లక్ష్యమని రాజాసింగ్ చెప్పారు. తన అనుచరులతో కలిసి నగరంలోకి వచ్చే అన్నీ మార్గాల వద్ద కాపుకాసి నగరంలోకి ఆవులను తరలించకుండా అడ్డుకొంటామని చెప్పారు. ఒకవేళ తన ఈ ప్రయత్నంలో ఏవైనా సమస్యలు ఎదురైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తన ఈ చర్యల వలన పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశ్యంతోనే రాజీనామా చేశానని రాజసింగ్ చెప్పారు.


Related Post