లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) సోమవారం ఉదయం కోల్కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో కనుమూశారు. పదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. ఆయన 1968లో సిపిఎం పార్టీలో చేరారు. కానీ 2008లో పార్టీ నుంచి అవమానకర పరిస్థితులలో తొలగించబడ్డారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు ఉపసహరించుకొన్నప్పుడు ఆయనను తన పదవికి రాజీనామా చేయవలసిందిగా పార్టీ ఆదేశించగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజకీయాలలోకి రాకమునుపు ఆయన కొంతకాలం కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా పలువురు అధికార, ప్రతిపక్షాల నేతలు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ అని పలువురు ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.