హైదరాబాద్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్లో జరిగే ఒక బహిరంగసభలో పాల్గొన్నాక అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, సిఎల్పినేత కె.జానారెడ్డి, వి.హనుమంత రావు తదితర కాంగ్రెస్ నేతలు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు.
అనంతరం రాహుల్ గాంధీ శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని అక్కడ మహిళా సంఘాల సభ్యులతో సమావేశం అవుతారు. అనంతరం శేరిలింగంపల్లి వద్ద టి-కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సమావేశానికి హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమ ప్రజలు పాల్గొంటారు. కనుక రాహుల్ గాంధీ వారి సమస్యల గురించి సభలో మాట్లాడుతారు.
అనంతరం రాహుల్ గాంధీ బేగంపేటలో గల హరిత ప్లాజా హోటల్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం నుంచి రాత్రి పది గంటలవరకు హైదరాబాద్లో వివిద వర్గాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ వరుస సమావేశాలలో పాల్గొంటారు. రేపు రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ పర్యటన ముగించుకొని మళ్ళీ డిల్లీ తిరిగివెళతారు.